సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 10 ।।
సహ యజ్ఞాః — యజ్ఞములతో పాటుగా; ప్రజాః — ప్రజలను; సృష్ట్వా — సృష్టించెను; పురా — ప్రారంభంలో; ఉవాచ — పలికెను; ప్రజా-పతిః — బ్రహ్మ దేవుడు; అనేన — దీని ద్వారా; ప్రసవిష్యధ్వమ్ — వృద్ది పొందుము; ఏషః— ఇవి; వః — మీకు; అస్తు — అగుగాక; ఇష్ట-కామ-ధుక్ — సర్వ అభీష్టములను తీర్చునది.
BG 3.10: సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి, ఇలా చెప్పాడు, ‘ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి.’
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అన్ని అంశములూ సహజంగానే తమ మూలభాగం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి, ప్రాణుల జీవనానికి అవసరమైన వేడిమి, వెలుగును ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమేగాక నాగరిక జీవన శైలి కోసం ఎన్నో ఖనిజాలను తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్దతరంగ శక్తి ప్రసరణకు దోహద పడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు - ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు, వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములను భగవత్ సేవ లాగా చేయటం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనము తప్పకుండా పాలుపంచుకోవాలి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఆయన మననుండి కోరుకొనే యజ్ఞం అదే.
ఒక చేతిని ఉదాహరణగా తీస్కొండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగం. దానికి కావలసిన పుష్టి — రక్తము, ప్రాణవాయువు (ఆక్సిజన్), పోషకాలు మొదలగునవి - శరీరం ద్వారా అందుతాయి, తిరిగి అది శరీరం కోసం అవసరమైన పనులు చేస్తుంది. ఒకవేళ చేతికి తను చేసే సేవ భారంగా/చికాకుగా అనిపించి, శరీరం నుండి తెగి విడిపోదామని నిర్ణయించుకుంటే, తనను తాను కొన్ని నిమిషాలు కూడా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల తాను చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వ-ప్రయోజనం కూడా నెరవేరుతుంది. అదే విధంగా మన జీవాత్మలం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశములమే, మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే, మన స్వ-ప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది.
సాధారణంగా 'యజ్ఞం' అన్న పదం అగ్ని హోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీత లో 'యజ్ఞం' అంటే భగవంతునికి సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు/విధులు అన్నీ కూడా దానిలోకి వస్తాయి.